Kashmir: కశ్మీర్ అంశంలో భారత్ కు మద్దతు పలికిన బాంగ్లాదేశ్

  • ఆర్టికల్ 370 రద్దు ఇండియా అంతర్గత వ్యవహారం
  • ఉపఖండం శాంతియుతంగా ఉండాలనేదే మా సిద్ధాంతం
  • అన్ని దేశాలు అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం

జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒక్క చైనా మినహా ఆ దేశానికి మద్దతు పలికిన వారెవరూ లేకపోయారు. మరోవైపు, భారత్ కు ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. రష్యా భారత్ ను పూర్తిగా వెనకేసుకురాగా... చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా సూచించింది. ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని యూకే, ఫ్రాన్స్ స్పష్టం చేశాయి. తాజాగా ఈ జాబితాలో మన పొరుగు దేశం బాంగ్లాదేశ్ కూడా చేరింది. ఇది భారత అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది.

'ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా వారి అంతర్గత వ్యవహారం. ఉపఖండంలో శాంతి, స్థిరత్వం ఉండాలనేదే బాంగ్లాదేశ్ సిద్ధాంతం. అంతేకాదు, ప్రతి దేశం అభివృద్ధి చెందాలనేదే మా ప్రధాన లక్ష్యం' అని ఓ ప్రకటనలో బాంగ్లాదేశ్ తెలిపింది.

More Telugu News