KTR: బీజేపీ ఎక్కడుందో మీ చెల్లి కవితను అడిగితే చెబుతుంది: కేటీఆర్ పై కిషన్ రెడ్డి సెటైర్

  • జేపీ నడ్డా ఎవరో తెలియదని చెప్పడం కేటీఆర్ కే చెల్లింది
  • ఢిల్లీలో నడ్డాను కేటీఆర్ ఎన్నోసార్లు కలవలేదా?
  • ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదు

బీజేపీపై విమర్శలు గుప్పించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఎవరో తెలియదని చెప్పడం కేటీఆర్ కే చెల్లిందని అన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో కలసి నడ్డాను ఎన్నో సార్లు కలవలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని కేటీఆర్ ప్రశ్నించారని... మీ చెల్లెలు కవితను అడిగితే బీజేపీ ఎక్కడుందో చెబుతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ లా తాము అహంకారపూరిత వ్యాఖ్యలు చేయబోమని అన్నారు.

ఏడు ఎంపీ స్థానాల్లో ఓటమిపాలవడంతో టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమని జోస్యం చెప్పారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని అన్నారు. ఏపీ రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిది కాదని... రాజధాని ఎక్కడ కట్టుకోవలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.

More Telugu News