chidambaram: చిదంబరం అరెస్ట్ కు రంగం సిద్ధం.. వైసీపీ, బీజేపీ మద్దతుదారుల సంబరాలు!

  • చిదంబరాన్ని తిట్టిపోస్తున్న అభిమానులు
  • తమ నాయకులను జైలుకు పంపాడని ఆగ్రహం
  • ఇప్పుడు ఆయనకూ అదే గతి పట్టబోతోందని వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చాలామంది బీజేపీ, వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు కేసులతో అమిత్ షాను జైలుకు పంపి వేధించారని బీజేపీ మద్దతుదారులు చెబుతున్నారు. ఇప్పుడు చిదంబరం వంతు వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. హోంమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐని ఉసిగొల్పి చిదంబరం తమ నాయకుడు జగన్ ను తీవ్రంగా వేధించాడని వైసీపీ మద్దతుదారులు సైతం గుర్తుచేస్తున్నారు. ఆ పాపం ఊరికే పోలేదనీ, దాని కర్మఫలాన్ని చిదంబరం ఇప్పుడు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు.

ఆయనకు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కాంగ్రెస్ నేతను తిట్టిపోస్తూ బీజేపీ, వైసీపీ మద్దతుదారులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 2007లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడులకు చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని సీబీఐ, ఈడీ చెబుతున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయన ముడుపులు అందుకున్నారని కేసులు నమోదు చేశాయి.

More Telugu News