Andhra Pradesh: అమరావతిని తరలిస్తే మహోద్యమం చేపడతాం.. ఆమరణ దీక్షకు కూర్చుంటాం!: ప్రత్తిపాటి హెచ్చరిక

  • అమరావతిని ముంచేందుకు ఏపీ సర్కారు కుట్ర
  • చంద్రబాబుపై పగ, కక్షతోనే ఇలా చేస్తున్నారు
  • ప్రధాని మోదీ ఇందులో జోక్యం చేసుకోవాలి

కుంటిసాకులతో రాజధాని అమరావతిని తరలించేందుకు కుట్ర జరుగుతోందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా అమరావతిని ముంచేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు.

‘అమరావతిని భ్రమరావతి చేయబోతున్నామని బొత్స సత్య నారాయణ నిన్న స్పష్టం చేశారు. చంద్రబాబుపై కోపం, పగతో అమరావతిని నిలిపివేయాలని కుట్ర చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము మహా ఉద్యమం చేపడతాం. ఎంతవరకైనా పోరాడుతాం. ఆమరణ దీక్షకు అయినా కూర్చుంటాం. రాజధాని రైతుల కోసం ప్రభుత్వాన్ని స్తంభింపజేసేలా మహోద్యమం చేపడతాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదు.

ఇప్పటికే రాజధాని అమరావతిలో చాలా ఖర్చు పెట్టారు. దీనిపై ప్రధాని మోదీ, బీజేపీ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కక్షధోరణితో వెళుతున్న ముఖ్యమంత్రిని నిలువరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలి’ అని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.

More Telugu News