Telangana: తెలంగాణలో ఎన్ కౌంటర్.. ఓ మావోయిస్టు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం!

  • తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన
  • కూంబింగ్ నిర్వహించిన పోలీసు బలగాలు
  • ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు

ప్రశాంతంగా ఉన్న పచ్చని అడవి కాల్పుల మోతతో దద్దరిల్లింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందగా, మిగతావారు ఘటనాస్థలి నుంచి తప్పించుకున్నారు. కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం బుడుగుల అటవీప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో జిల్లాలోని బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి.

బడుగుల అటవీప్రాంతానికి రాగానే పోలీసులను గమనించిన మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పొజిషన్ తీసుకుంటూ ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో గుంటూరు రవి అనే మావోయిస్టు ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు కాల్పులు జరుపుతూ అడవుల్లోకి పారిపోయారు.

కాగా, ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ విస్తరణ కోసం మావోలు గ్రామాల్లో తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశామని చెప్పారు.

More Telugu News