Andhra Pradesh: త్వరలో పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తాం: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

  • రాయితీలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం
  • పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తా
  • చిన్న, మధ్య తరగతి పరిశ్రమలపై దృష్టి సారించాం

ఏపీలో త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో తీసుకురాబోయే కొత్త విధానంలో పారిశ్రామిక రాయితీలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాయితీలపై స్పష్టతను ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తామని, ఇచ్చిన మాట తప్పకూడదన్న ఉద్దేశంతోనే కొత్త పాలసీ వచ్చేంత వరకూ వేచి చూడమని పారిశ్రామికవేత్తలను కోరినట్టు చెప్పారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రాయితీలు చెల్లించకుండా రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆరోపించారు. గత ప్రభుత్వ తీరును పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారని, గతంలో ఇచ్చిన రాయితీలను కచ్చితంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి పరిశ్రమలు రావడం ఇష్టంలేని కొంతమంది తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పరిశ్రమల కోసం ఏపీఐఐసీకి రెండు నెలల్లో 800 దరఖాస్తులు వచ్చాయని అన్నారు, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు.

More Telugu News