Uttar Pradesh: భోజనంలో లడ్డూలే పెట్టి వేధిస్తున్న భార్య.. విడాకులు కోసం కోర్టుకెళ్లిన భర్త!

  • ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఘటన
  • తాంత్రికుడి సలహాతో భర్తకు లడ్డూలు పెడుతున్న భార్య
  • కనీసం భోజనాన్ని కూడా తిననివ్వని వైనం

భర్త వేధిస్తున్నాడనో, భార్య అనుమానంతో నరకం చూపిస్తోందనో విడాకులు కోరే జంటలను మనం ఇప్పటివరకూ చూసుంటాం. కానీ తాజా ఘటన మాత్రం ఇంకొంచెం విచిత్రమైంది. తన భార్య ఇంట్లో భోజనానికి బదులుగా లడ్డూలు పెట్టి వేధిస్తోందనీ, వెంటనే తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది.

యూపీకి చెందిన ఈ బాధితుడికి పదేళ్ల క్రితం పెళ్లయింది. ఈ జంటకు ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే వీరి కాపురంలో ఓ తాంత్రికుడు చిచ్చు పెట్టాడు. ఇటీవల భర్త అనారోగ్యానికి గురికాగా, భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. దీంతో అతను..‘నీ భర్త ఆరోగ్యం బాగుపడాలంటే అతనికి ఉదయం 4, సాయంత్రం 4 లడ్డూలు తినిపించు’ అని సలహా ఇచ్చాడు.

దీంతో తన భార్య భోజనాన్ని ముట్టుకోనివ్వడం లేదనీ, లడ్డూలతో చంపేస్తుందని బాధితుడు కోర్టు ముందు వాపోయాడు. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీస్ అధికారులు ఈ జంటకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఒకవేళ కౌన్సెలింగ్ ముగిశాక కూడా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోతే విడాకులు మంజూరు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

More Telugu News