Andhra Pradesh: ఆ ఫర్నీచర్ నా దగ్గరే ఉంది.. వచ్చి పట్టుకెళ్లండి!: టీడీపీ నేత కోడెల శివప్రసాద్ వివరణ

  • ఫర్నీచర్ ను నేను వినియోగించుకున్నా
  • వాటిని తీసుకెళ్లాలని అసెంబ్లీ అధికారులకు లేఖ రాశా
  • ఇప్పటివరకూ దానికి జవాబు ఇవ్వలేదు

టీడీపీ నేత కోడెల శివప్రసాద్ హయాంలో ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, ఏసీలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఈ వివాదంపై స్పందించారు. హైదరాబాద్ నుంచి ఏపీ అసెంబ్లీకి సామగ్రిని తరలించేటప్పుడు కొంత ఫర్నీచర్ ను తాను వినియోగించుకున్నానని కోడెల తెలిపారు.

తన దగ్గరున్న ఫర్నీచర్ ను తీసుకెళ్లాల్సిందిగా అసెంబ్లీ అధికారులకు లేఖ కూడా రాశానని, కానీ అసెంబ్లీ అధికారులు తన లేఖపై ఇంతవరకూ స్పందించలేదని ఆయన చెప్పారు. ఇప్పటికైనా అధికారులు వస్తే ఫర్నీచర్ అప్పగిస్తానని కోడెల స్పష్టం చేశారు.

లేదంటే ఈ ఫర్నీచర్ కోసం ఎంత ఖర్చయిందో చెబితే తాను చెల్లించేందుకు సిద్ధమేనని కోడెల చెప్పారు. 2017, మార్చి నెలలో ఏపీ అసెంబ్లీకి తరలిస్తున్న కొంత ఫర్నీచర్, కొన్ని ఏసీలు మాయం కావడంపై అసెంబ్లీ కార్యదర్శి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసెంబ్లీకి చేరుకున్న పోలీసులు, సామగ్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News