chandrayan-2: చంద్రయాన్-2లో మరో ముందడుగు.. జాబిల్లి కక్ష్యలోకి చేరిన వాహకనౌక!

  • ద్రవ ఇంజిన్ ను మండించిన ఇస్రో శాస్త్రవేత్తలు
  • త్వరలోనే మరో 3 సార్లు ఈ ప్రక్రియ
  • చంద్రుడికి 150 కి.మీ సమీపానికి వెళ్లనున్న నౌక

చంద్రుడిని శోధించేందుకు భారత్ ఇటీవల చంద్రయాన్-2 వాహకనౌకను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగంలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది. చంద్రయాన్-2ను ప్రయోగించిన 29 రోజుల తర్వాత ఈ వాహకనౌక చందమామ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో ‘మేక్ ఆర్ బ్రేక్’గా వ్యవహరించే ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ సందర్భంగా చంద్రయాన్-2 వేగాన్ని తగ్గించిన శాస్త్రవేత్తలు.. వాహకనౌకను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేర్చారు. ఇందుకోసం నౌకలోని ద్రవ ఇంజిన్ ను మండించారు. ఈ నెల 21, 28, 30 ల్లో ఇదే తరహా ప్రక్రియను చేపట్టి వాహకనౌకను చంద్రుడికి 150 కిలోమీటర్ల సమీపానికి తీసుకెళతారు.

ఈ వాహకనౌకలోని ల్యాండర్ వచ్చే నెల 7న చంద్రుడిపై ల్యాండ్ కానుంది. అనంతరం అందులోని రోవర్ కిందికి దిగుతుంది. అనంతరం అక్కడి ఖనిజాలను, ఇతర వనరులను విశ్లేషించి సమాచారాన్ని ఆర్బిటర్, ల్యాండర్ ద్వారా భూమికి చేరవేయనుంది.

More Telugu News