Karnataka: చదివేది తొమ్మిదో తరగతి... ప్రియుడి కోసం తండ్రిని హత్య చేసింది!

  • బెంగళూరులో ఓ కుమార్తె దురాగతం
  • తండ్రికి నిద్రమాత్రలిచ్చి హత్య
  • ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం
  • మంటలంటుకుని ప్రియుడు, ప్రియురాలు ఆసుపత్రికి

తెలిసీ తెలియని వయసులో ప్రేమ. వారించిన తండ్రిపై ఆగ్రహం. ప్రియుడిని వదిలి వుండలేని మనసు... ఇవన్నీ కలిపి కన్న తండ్రిని హత్య చేసేందుకు ఓ అమ్మాయిని పురిగొల్పాయి. మగ పిల్లాడితో స్నేహం ఏంటని వారించడమే ఆ తండ్రి చేసిన పాపమైంది. పకడ్బందీగా కుట్ర పన్ని తండ్రిని చంపేసిన ఆ అమ్మాయిని చూసి పోలీసులే విస్తుపోతున్నారు. ఇంతకీ అమ్మాయి వయసు కేవలం 15 సంవత్సరాలు. చదువుతున్నది తొమ్మిదో తరగతి మాత్రమే. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే...

ఇక్కడి రాజాజీనగర ఐదో బ్లాక్‌ లో ఓ వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఆయనకు నైన్త్ క్లాస్ చదివే కుమార్తె ఉంది. ఆమె తన ఇంటికి సమీపంలోనే ఉంటూ బీకామ్ చదువుకుంటున్న ప్రవీణ్‌ అనే యువకుడితో చనువుగా ఉండేది. ప్రవీణ్ పదేపదే తమ ఇంటికి రావడాన్ని చూసిన ఆమె తండ్రి వారించాడు.

దీంతో ఆ బాలిక తండ్రిపై కోపం పెంచుకుంది. అతను ఉంటే తమ పరిచయం కొనసాగదని భావించి, అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకుంది. ఇందుకోసం పక్కా ప్లాన్ వేసింది. గత ఆదివారం నాడు తన తల్లి, తమ్ముడు పాండిచ్చేరికి బయలుదేరుతుంటే, వారిని దింపివస్తానని చెప్పి రైల్వే స్టేషన్ కు బయలుదేరిన ఆమె, వెళుతూ వెళుతూ తండ్రికి నిద్రమాత్రలు కలిపిన పాలను ఇచ్చింది.

ఇద్దరినీ రైల్లో పంపి వచ్చేసరికి, తండ్రి నిద్రపోతుంటే, ప్రియుడైన ప్రవీణ్ ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి ఆయన్ను విచక్షణారహితంగా గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచారు. మృతదేహాన్ని బాత్ రూమ్ లో పడేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే, కొంత పెట్రోల్ వారిపైనా పడటంతో మంటలు విస్తరించాయి.

దీంతో బాలిక మిద్దెపైకి ఎక్కి కేకలు పెట్టింది. చుట్టుపక్కలవారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటల్ని ఆర్పి, గాయపడ్డ ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. తొలుత తాము బయటకు వెళ్లి టిఫిన్ చేసి వచ్చేసరికి మంటలు అంటుకున్నాయని చెప్పిన ఆమె, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆసలు నిజాన్ని ఒప్పుకుంది. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామన్నారు.

More Telugu News