Hyderabad: తండ్రిని చంపింది పింఛను సొమ్ముకోసమేనట.. హత్యకు భార్య, కుమార్తెల సహకారం?

  • హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసు
  • భర్తపై భార్యకు, తండ్రిపై కుమార్తెకు కోపం
  • హత్యలో వారు కూడా భాగస్వాములేనని పోలీసుల అనుమానం

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసులో  విస్తుపోయే విషయం వెలుగుచూసింది. పింఛన్ డబ్బుల కోసమే తండ్రిని హత్య చేసినట్టు నిందితుడు వెల్లడించడంతో షాకయ్యారు.  మౌలాలి ఆర్టీసీ కాలనీ ఎన్ఏ కృష్ణనగర్‌లో నివసించే మారుతి (70) దారుణ హత్యకు గురయ్యాడు. కన్న కుమారుడే అతడిని దారుణంగా చంపి ముక్కలుగా కోసి బకెట్లో వేసిన తీరు తీవ్ర సంచలనమైంది.  

మారుతి కుమారుడు కిషన్ (38) తండ్రి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం అతడికి పెళ్లయినా భర్త తీరు నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. తాగుడుకు అలవాటు పడిన కిషన్‌కు తండ్రి సరిపడా డబ్బులు ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. తండ్రిని చంపేస్తే ఆయనకు వచ్చే పింఛను డబ్బులను తల్లి నుంచి తీసుకోవచ్చని ప్లాన్ వేశాడు. దీంతో అతడిని దారుణంగా హత్య చేశాడు.

అయితే, భర్తను కుమారుడు చంపుతుంటే భార్య, కుమార్తెలు చూస్తూ ఎలా ఊరుకున్నారనేది చర్చనీయాంశమైంది. భార్య గయ, కుమార్తె ప్రఫుల్లల పాత్ర కూడా ఈ హత్యలో ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వయసు మీదపడుతున్నా పెళ్లి చేయకపోవడంతో కుమార్తె, అన్ని పనులు తనతోనే చేయించుకుంటుండడంతో భార్య.. మారుతిపై కోపంగా ఉన్నారని, అందుకే వారు ఈ హత్య విషయంలో సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News