Prajashanti: కేఏ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  • సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో పాల్ నిందితుడు
  • ఈ కేసు విచారణకు హాజరుకాని పాల్
  • అరెస్టు వారెంట్ జారీ చేసిన మహబూబ్ నగర్ కోర్టు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరుకానందున వారెంట్ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి మిగతా నిందితులు హాజరైనప్పటికి పాల్ మాత్రం హాజరు కాలేదు. దీంతో, పాల్ కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు సమాచారం.

కాగా, 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పదస్థితిలో డేవిడ్ రాజు మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న కారులో డేవిడ్ రాజు మృతదేహం లభ్యమైంది. హత్య కేసులో తొమ్మిదో నిందితుడిగా పాల్ ఉన్నారు. పాల్ కు, డేవిడ్ రాజు కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాల్సిందిగా పాల్ కు పలుమార్లు కోర్టు నోటీసులు పంపారు. అయినప్పటికీ పాల్ స్పందించకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు సమాచారం.

More Telugu News