JP Nadda: జేపీ నడ్డా కాదు.. పచ్చి అబద్ధాల అడ్డా: కేటీఆర్

  • ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని చదివారు
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై పడి ఏడుస్తున్నారు
  • హైదరాబాదుకు రూపాయి కూడా మోదీ ఇవ్వలేదు

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని నడ్డా చదివారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పడి ఏడుస్తున్నారని... కేంద్ర సంస్థలను అడిగి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీతి ఆయోగ్ ఎందుకు కితాబిచ్చిందో తెలుసుకోవాలని సూచించారు. నడ్డా అడ్డగోలుగా మాట్లాడారని... ఆయనకు సిగ్గనిపించడం లేదా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన జేపీ నడ్డా కాదని... పచ్చి అబద్ధాల అడ్డా అని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేసేవారు దమ్ముంటే వాటిని నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాదుకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి, ఆ చలిమంటల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీవాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని, వారిని ఎవరూ పట్టించుకోవద్దని చెప్పారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండటం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నచ్చదని అన్నారు.

More Telugu News