Crime News: మైనర్‌ బాలికపై దాష్టీకం...గ్రామ పెద్దపై కేసు నమోదు చేసిన పోలీసులు

  • ప్రేమించిన నేరానికి కాళ్లతో తన్ని, కర్రతో కొట్టిన పెద్ద
  • రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఘటన
  • ప్రేమ పాఠాలు వల్లించిన బాలుడిపై ఫోక్సో కేసు

ప్రేమించుకున్నారన్న నేరానికి ఇద్దరు మైనర్లపై దాష్టీకానికి ఒడిగట్టిన గ్రామ పెద్దపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తలిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా గుమ్మమట్ట మండలంలోని కె.పి.దొడ్డిలో గ్రామపెద్ద లింగప్ప మైనర్లను కాలితో తన్ని, కర్రతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన వీడియో తీసి ఎవరో సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్‌ అయ్యింది. పోలీసులు, అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్‌ వెంకటచలపతి, సీఐ రాజులు బాధిత బాలిక ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు.  లింగన్నపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను ప్రేమించిన బాలుడిపైనా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మైనర్‌ బాలికను కొట్టే సమయంలో రచ్చబండపై ఉన్నవారిని కూడా విచారించి వారిపైనా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మరోవైపు బాధితురాలికి న్యాయం జరగాలంటూ శనివారం ఉదయం నుంచి వివిధ దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.


More Telugu News