Arun Jaitly: లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై అరుణ్ జైట్లీ... ఎయిమ్స్ కు క్యూ కట్టిన కేంద్ర మంత్రులు!

  • మరింతగా విషమించిన ఆరోగ్యం
  • చికిత్స అందిస్తున్న నలుగురు వైద్యుల బృందం
  • పరిస్థితి అడిగి తెలుసుకున్న పలువురు ప్రముఖులు

ఈ నెల 10వ తేదీ నుంచి ఎయిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. ఆయన్ను లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉంచిన నలుగురు వైద్యుల బృందం, చికిత్సను అందిస్తోంది. కాగా, ఈ ఉదయం జైట్లీని పరామర్శించేందుకు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఆసుపత్రికి చేరుకున్నారు.

ఆరెస్సెస్‌ ఛీప్‌ మోహన్‌ భగవత్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ లతో పాటు బీజేపీ నేత సతీశ్‌ ఉపాధ్యాయ్‌, కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ సింఘ్వి, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఎయిమ్స్ కు వచ్చారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

కాగా, ఈ నెల 9న జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో, ఎయిమ్స్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఆపై 10వ తేదీన ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. మరో హెల్త్ బులిటెన్ ఇంతవరకూ విడుదల కాలేదు.

More Telugu News