Tamilnadu: పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఓ వ్యక్తిని దారుణంగా చంపేసిన గంజాయి గ్యాంగ్!

  • తమిళనాడులోని మదురైలో ఘటన
  • గంజాయి వ్యాపారంపై పోలీసులకు మారిముత్తు ఫిర్యాదు
  • పక్కా ప్లాన్ తో వేటకొడవళ్లతో హత్య

గంజాయి స్మగ్లర్లపై ఫిర్యాదు చేసిన పాపానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో సదరు దుండగులు ఫిర్యాదుదారుడిని కిరాతకంగా హత్య చేశారు. తమిళనాడులోని మదురైలో నిన్న ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక్కడి కృష్ణాపురం కాలనీకి చెందిన మారిముత్తు స్థానికంగా టీ దుకాణం పెట్టుకున్నాడు. అయితే కొందరు వ్యక్తులు ఇక్కడ గంజాయిని అమ్మడాన్ని ఆయన గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే కారణమేంటో తెలియదు కానీ, పోలీసులు మాత్రం ఈ ఫిర్యాదును చూసీచూడనట్లు వదిలేశారు.

ఈ విషయం తెలుసుకున్న గంజాయి గ్యాంగ్ మారిముత్తును చంపేయాలని నిర్ణయించింది. అందులోభాగంగా అతని షాపుకు వెళ్లిన ఆరుగురు వ్యక్తులు టీ కావాలని అడిగారు. దీంతో డబ్బులు ఇవ్వాలని మారిముత్తు కోరారు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా? అంటూ అతనితో గొడవకు దిగిన దుండగులు వేటకొడవళ్లతో ఆయనపై దాడిచేసి పరారయ్యారు. మారిముత్తు అరుపులు విన్న ఇరుగుపొరుగువారు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News