India: ‘మారుతీ సుజుకి’ తీవ్ర నిర్ణయం.. 3,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన!

  • దేశీయ,అంతర్జాతీయ మార్కెట్ లో క్షీణించిన అమ్మకాలు
  • 3 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు కంపెనీ బైబై
  • శాశ్వత ఉద్యోగులను తొలగించడం లేదన్న కంపెనీ

అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో అమ్మకాలు మందగించిన నేపథ్యంలో ఆటో మొబైల్స్ ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ప్రపంచవ్యాప్తంగా 12,500 ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించగా, తాజాగా ఈ జాబితాలో భారత కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకి’ కూడా చేరింది. మారుతీ సుజుకి సంస్థ తాజాగా 3,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు వేసింది. ఈ తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను పునరుద్ధరించేందుకు కంపెనీ ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కంపెనీ చైర్మన్ ఆర్ సీ భార్గవ ధ్రువీకరించారు.

‘ఇది వ్యాపారంలో ఒక భాగమే. మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగినప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటాం. డిమాండ్‌ తగ్గితే ఆ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తాం. ఇప్పుడు గిరాకీ తగ్గడంతో 3,000 మంది తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యూవల్‌ చేయడంలేదు. అయితే శాశ్వత ఉద్యోగుల్లో ఎవరినీ తొలగించడం లేదు’ అని భార్గవ స్పష్టం చేశారు.

ఇటీవలి కాలంలో కార్ల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా తగ్గాయి. దీంతో పలు సంస్థలు తమ ఉత్పత్తిని చాలావరకూ తగ్గించాయి. ఈ విషయమై భార్గవ మాట్లాడుతూ.. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఆటోమొబైల్ పరిశ్రమ మరోసారి పుంజుకుంటుందని తెలిపారు. భారత్ స్టేజ్-6 వాహనాలు వచ్చాక 2021 నాటికి భారత ఆటో మొబైల్ పరిశ్రమ బలంగా వృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

More Telugu News