Uttar Pradesh: రెండో పెళ్లి వద్దన్న పిల్లలు.. మనస్తాపంతో 75 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య!

  • ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఘటన
  • తోడు కోసం పెళ్లి చేసుకోవాలనుకున్న అర్షద్
  • పరువు పోతుందని పిల్లల ఆగ్రహం
  • మనస్తాపంతో ఉరి వేసుకుని పెద్దాయన ఆత్మహత్య

వృద్ధాప్యంలో తనకో తోడు కావాలనుకున్నాడు. రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇందుకు ఇంట్లోని పిల్లలు ఒప్పుకోలేదు. దీంతో సదరు పెద్దాయన ఉరి వేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయ్ బరేలీలోని కాన్షీరాం కాలనీలో అర్షద్(75) నివాసం ఉంటున్నారు. అర్షద్ కు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అమ్మాయిలకు ఆయన పెళ్లిళ్లు చేసేశారు. ప్రస్తుతం ముగ్గురు కుమారులు తండ్రితో కలిసి ఉంటున్నారు.

కొన్నేళ్ల క్రితం అర్షద్ మొదటి భార్య చనిపోయింది. ఓవైపు వయసు మీదపడటం, ఇంట్లో ఎవ్వరూ తోడు లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకోవాలని అర్షద్ భావించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుమారుడు రచ్చరచ్చ చేశారు. ‘ఈ వయసులో మీరు పెళ్లి చేసుకుంటే మన కుటుంబం పరువు పోతుంది. దీనికి మేం ఒప్పుకోం’ అని గొడవకు దిగారు. ఈ సందర్భంగా వీరి మధ్య తీవ్ర వాదనలు జరిగాయి.

అనంతరం మరుసటి రోజు(శుక్రవారం) అర్షద్ తన గది నుంచి బయటకు రాకపోవడంతో ఆయన పిల్లలు కిటికీ నుంచి తొంగిచూడగా, తండ్రి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన పిల్లలు, తలుపులు పగులగొట్టి తండ్రి మృతదేహాన్ని కిందకు దించారు. మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టంలో అర్షద్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. 

More Telugu News