TRS: 1,400 జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి మాయం చేసేశారు!: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్

  • రూ.500 కోట్లతో కొత్త అసెంబ్లీ ఎందుకు?
  • ఆ నిధులను ఆరోగ్యశ్రీ బకాయిలకు ఇవ్వొచ్చుగా
  • కేసీఆర్ కాళేశ్వరంలో కమీషన్లు దండుకున్నారు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ స్కీం(పథకం) వెనుక స్కాం(కుంభకోణం) ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తన మానస పుత్రికగా చెప్పుకుంటున్న కేసీఆర్, దాని అంచనాలను రూ.30,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో కేసీఆర్ 6 శాతం కమీషన్ దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుని తింటున్నారని దుయ్యబట్టారు. ఉన్న అసెంబ్లీని కూల్చేసి, రూ.500 కోట్లతో కొత్త అసెంబ్లీ కడతామని కేసీఆర్ చెప్పడాన్ని లక్ష్మణ్ తప్పుపట్టారు. ఈ కొత్త సచివాలయానికి బదులుగా ఆ నిధులను ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి వాడొచ్చు కదా అని సూచించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం జారీచేస్తున్న జీవోలను వెబ్ సైట్ లో కనిపించకుండా చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇప్పటివరకూ 5 శాఖలకు సంబంధించి 1,400 జీవోలు కనిపించకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News