Andhra Pradesh: మీరు ఒక్క దరఖాస్తు నింపండి.. సీఎం కార్యాలయం అన్నీ చూసుకుంటుంది!: అమెరికాలో పెట్టుబడిదారులకు జగన్ హామీ

  • ఏపీలో అవినీతిరహిత, పారదర్శక పాలన ఉంది
  • పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఎలాంటి అడ్డంకులు ఉండవు
  • యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ భేటీలో జగన్

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టాలనుకునే పెట్టుబడిదారులు ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీలో ప్రస్తుతం అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేశారు. స్వయంగా సీఎం కార్యాలయం దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ (డీసీ)లో  యూఎస్‌ – ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు.

ఏపీలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ అథారిటీ (ఇప్మా) అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సంస్థ పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్, నీరు సమకూర్చి పెడుతుందని చెప్పారు. ఏపీలో విశాలమైన సముద్రతీరం ఉందనీ, పలు కొత్త నౌకాశ్రయాలు నిర్మిస్తున్నామని జగన్ అన్నారు. ఈ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆయన అమెరికా పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

ఉప్పునీటిని మంచినీటిగా మార్చడం, మైట్రో రైలు ప్రాజెక్టులు, బకింగ్ హమ్ కాలువ, విద్యుత్ బస్సులు, నదుల అనుసంధానం, ఆక్వా తదితర రంగాల్లో విస్తరణ కోసం ఏపీలో అపారమైన అవకాశాలు, మార్కెట్ ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా జగన్  అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లాతో సమావేశమయ్యారు.

More Telugu News