Andhra Pradesh: చెవిటికల్లు పడవ ప్రమాదం .. గల్లంతైన బాలిక మృతదేహాన్ని కనుగొన్న ఎన్డీఆర్ఎఫ్!

  • కృష్ణా జిల్లాలో నిన్న గల్లంతైన బాలిక
  • రాత్రి నుంచి కొనసాగిన సహాయక చర్యలు
  • విషాదంలో మునిగిపోయిన చెవిటికల్లు వాసులు

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా చెవిటికల్లు గ్రామంలో నిన్న నాటు పడవ బోల్తా కొట్టడంతో గల్లంతైన బాలిక గౌతమి ప్రియ చనిపోయింది. కృష్ణా నదిలో గల్లంతైనప్పటికీ బాలిక ఒడ్డుకు కొట్టుకొచ్చి ఉంటుందని అధికారులు భావించారు. కానీ బాలిక గల్లంతైన అనంతరం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపును ముమ్మరం చేయడంతో గౌతమి మృతదేహం లభ్యమైంది. దీంతో అధికారులు బాలిక మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గౌతమి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

తండ్రి, సోదరి తులసి ప్రియతో కలిసి గౌతమిప్రియ నిన్న తమ అమ్మమ్మ వాళ్ల ఇంటికి నాటు పడవలో బయలుదేరింది. అయితే నది మధ్యలోకి రాగానే ప్రవాహం ధాటికి పడవ బోల్తా కొట్టింది. ఈ సందర్భంగా తండ్రి తులసిప్రియను కాపాడగలిగినా, గౌతమి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాలిక కోసం గాలింపును ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఈరోజు బాలిక మృతదేహం లభ్యమైంది.

More Telugu News