Anantapur District: అనంతపురంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన!

  • ఊరు విడిచిన ప్రేమికులను రప్పించి పంచాయితీ
  • బాలిక గుండెలపై తంతూ, కర్రతో చావబాదుతూ వీరంగమేసిన ఊరిపెద్ద 
  • సినిమా చూసిన చుట్టూ ఉన్న వందమంది

అనంతపురంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఉత్తరాదిలో అప్పుడప్పుడు కనిపించే ఆటవిక చర్య జిల్లాలో పట్టపగలు దర్శనమిచ్చింది. చుట్టూ వందమందికిపైగా ఉన్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన పాపాన పోలేదు. అంతగా జరిగిన ఆ అమానవీయ ఘటన వివరాలు...
 
గుమ్మఘట్ట మండలంలోని కేపీదొడ్డి గ్రామానికి చెందిన ప్రేమజంట పది రోజుల క్రితం ఊరి విడిచి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల తల్లిదండ్రులు వారిని పిలిపించి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అది అమానవీయంగా తయారైంది. గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప చెలరేగిపోయాడు.

పెద్దల మాట విననంటావా అంటూ కర్రతో రెచ్చిపోయాడు. అందరూ చూస్తుండగానే బాలిక చెంపలు చెడామడా వాయించాడు. అక్కడితో ఆగకుండా కర్రతో గొడ్డును బాదినట్టు బాదుతూ, కాళ్లతో బాలిక గుండెలపై తంతూ వీరంగమేశాడు. యువకుడిపైనా, బాలిక తండ్రిపైనా తన ప్రతాపం చూపించాడు. పంచాయితీకి వచ్చిన ఇతర పెద్దలు, చుట్టూ వున్న వందమంది జనం సినిమా చూస్తున్నట్టు చూశారు.  

లింగప్ప శివాలెత్తడం మీడియాకెక్కడంతో ఈ కిరాతకం వెలుగుచూసింది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అయింది. ఇంత జరిగినా ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని, అసలు తమ దృష్టికే రాలేదని పోలీసులు చెబుతుండడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.  

More Telugu News