Andhra Pradesh: కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసిన ఏపీ సర్కార్

  • ఇకపై ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మద్యం షాపులు
  • మండలాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో షాపులు
  • మద్యం షాపు నిర్వహణకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ

ఏపీలో దశల వారీగా మద్యం నిషేధానికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇకపై మద్యం షాపులను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. మండలాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించనుంది. మద్యం షాపుల ఏర్పాటుకు తగిన ప్రదేశాలను బేవరేజెస్ కార్పొరేషన్ గుర్తించనుంది. ఒక్కో మద్యం షాపు 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. ప్రతి మద్యం దుకాణానికి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నెంబర్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి షాపులో సీసీ కెమెరాలను అమర్చనున్నారు.

మద్యం షాపు నిర్వహణ నిమిత్తం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఒక్కో షాపునకు పట్టణ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బందిని నియమిస్తారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను నియమించనున్నారు. డిగ్రీ అర్హతతో సూపర్ వైజర్, ఇంటర్ మీడియట్ అర్హతతో సేల్స్ మెన్ ఉద్యోగం ఇస్తారు. సూపర్ వైజర్ కు రూ.17,500, సేల్స్ మెన్లకు రూ.15 వేలు జీతం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలను నిర్వహిస్తారు. కాగా, ఈ ఏడాది 3,500 మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల్లో 880 షాపులకు కోత విధించనుంది.

More Telugu News