Pawan Kalyan: జనసేనను కలిపేయమంటూ ఒక పెద్ద పార్టీ నాపై ఒత్తిడి పెంచుతోంది: పవన్ కల్యాణ్

  • ఏ పార్టీలో జనసేనను విలీనం చేసే ప్రసక్తే లేదు
  • నా బలమేంటో, బలహీనత ఏంటో నాకు తెలుసు
  • సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించండి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనను కలిపేయాలంటూ ఒక పెద్ద పార్టీ తనపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తోందని చెప్పారు. అయితే, ఏ పార్టీలోనూ జనసేనను విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మానవతా విలువల కోసం, జాతి సమగ్రతను కాపాడటం కోసమే జనసేనను ప్రారంభించామని... అందుకే మరే పార్టీలో జనసేనను కలపబోమని తెలిపారు.

తన బలమేంటో, బలహీనత ఏంటో తనకు తెలుసని పవన్ చెప్పారు. సత్యం కోసం తాను పని చేస్తానని తెలిపారు. ఏ విషయంలోనైనా ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలని... అలా కాకుండా, రోడ్ మీదకు వెళ్లో, సోషల్ మీడియాలో పోస్టుల పెట్టడం ద్వారానో చెబితే వినడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదని అన్నారు. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. జనసైనికులంతా వరద బాధితులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కూడా చోటుచేసుకుంది. పవన్ తో ఫొటోలు దిగడానికి జనసైనికులు ఆసక్తి చూపారు. దీంతో ఆయన మాట్లాడుతూ, మీతో ఫొటోలు దిగడానికి తనకు ఇబ్బందేమీ లేదని... అయితే, అందరూ ఒకేసారి మీద పడిపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చమత్కరించారు.

More Telugu News