Chandrashekar: భారత క్రికెట్ మాజీ ఓపెనర్ వీబీ చంద్రశేఖర్ మృతి.. ఆత్మహత్యగా అనుమానం!

  • ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య?
  • ఫస్ట్ క్లాస్ లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన చంద్రశేఖర్
  • సంతాపం తెలిపిన పలువురు క్రికెటర్లు

భారత మాజీ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాట్స్ మన్, తమిళనాడు క్రికెట్‌ కు ఎంతోకాలం సేవలందించిన వీబీ చంద్రశేఖర్, అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా చెన్నైలోని తన నివాసంలో కనిపించగా, పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. 57 ఏళ్ల చంద్రశేఖర్, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కలేక ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

తమిళనాడు ప్రీమియర్ లీగ్ టీమ్ 'వీబీ కంచి వీరన్స్' ఏర్పాటైన తరువాత ఆయనపై రుణభారం పెరిగినట్టు తెలుస్తోంది. కేసును విచారిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు.

కాగా, భారత్ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటుతూ 43.09 సరాసరిని నమోదు చేశారు. చంద్రశేఖర్ మరణవార్త క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. బీసీసీఐతో పాటు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తదితరులు సంతాపం తెలిపారు.

తమిళనాడు ఓపెనర్‌ గా చంద్రశేఖర్ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడారు. దూకుడుగా ఆయన ఆడే విధానానికి క్రికెట్ అభిమానులు ముగ్ధులయ్యేవారు. 1988–89 ఇరానీ కప్‌ మ్యాచ్‌ లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2012లో ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించిన ఆయన తమిళనాడు కోచ్‌ గా, భారత జట్టు సెలక్టర్‌ గా పనిచేశారు.

More Telugu News