sr nagar: స్పా సెంటర్ నిర్వాహకులను బెదిరించి.. డబ్బులు గుంజిన నకిలీ విలేకరులు

  • ఎస్సార్‌నగర్‌లో ఆర్‌వై ఫ్యామిలీ బ్యూటీ పార్లర్ అండ్ స్పా సెంటర్‌
  • ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించిన నకిలీ రిపోర్టర్లు
  • లక్ష డిమాండ్.. రూ.50 వేలతో పరార్

విలేకరుల పేరుతో స్పా సెంటర్ నిర్వాహకులను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసిన నకిలీ విలేకరులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్సార్‌నగర్‌లోని ఆర్‌వై ఫ్యామిలీ బ్యూటీ పార్లర్ అండ్ స్పా సెంటర్‌కు ఈ నెల 7న రాత్రి 8 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు.  

వచ్చీ రావడంతోనే లోపలికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయడం ప్రారంభించారు. తాము ఓ చానల్ విలేకరులమని, నిర్వాహకుడు ఎక్కడున్నా ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్పా యజమాని రమణతో తమను తాము ఎస్‌9 రిపోర్టర్లుగా పరిచయం చేసుకున్నారు. స్పా పేరుతో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలను ప్రచురించకుండా ఉండాలంటే లక్షరూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దీంతో స్పా యజమాని రమణ వారికి రూ.50 వేలు ముట్టజెప్పి అక్కడి నుంచి పంపించివేశాడు. ఆ తర్వాత అనుమానంతో వారి గురించి ఆరా తీయగా వచ్చిన వారు నకిలీ విలేకరులని తేలింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు.  

More Telugu News