ESL Narasimhan: అది మనసులో పెట్టుకుని కొడతారేమోననే రాలేదు: ఎట్ హోంలో గవర్నర్-రేవంత్ రెడ్డి మధ్య సరదా సంభాషణ

  • ఎట్‌హోంలో నవ్వులే నవ్వులు
  • రేవంత్, షబ్బీర్ అలీతో సరదా సంభాషణ
  • కల్పించుకున్న గవర్నర్ భార్య

హైదరాబాద్‌లో నిన్న జరిగిన గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ నరసింహన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మధ్య సరదా సంభాషణ జరిగింది. కార్యక్రమానికి వచ్చిన అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా చేతులు కలిపిన గవర్నర్.. రేవంత్‌ను చూస్తూ ఆగిపోయారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన చర్చ అక్కడ నవ్వులు పూయించింది.

గవర్నర్: వచ్చావా? రాలేదేమోనని నీ కోసమే చుట్టూ చూస్తున్నా
రేవంత్: మీరు ఆహ్వానించాక రాకుండా ఉంటానా?
గవర్నర్: మరి, నన్ను కలవడానికి వస్తానన్నారుగా, ఎందుకు రాలేదు
రేవంత్: మీరు కొడతారేమోనని
గవర్నర్: నేను కొట్టానా?.. మీరే నన్ను కొట్టారు (గతంలో అసెంబ్లీలో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ)
రేవంత్: అందుకే రాలేదు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఎక్కడ కొడతారోనని భయపడే రాలేదు
అని రేవంత్ బదులివ్వడంతో ‘ఎట్ హోం’లో పాల్గొన్న నేతలందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

ఆ తర్వాత పక్కనే ఉన్న షబ్బీర్ అలీని గవర్నర్ పలకరిస్తూ.. ‘‘నాపై కోపంగా ఉన్నట్టున్నారే’’ అని అన్నారు. పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే అందుకుని.. ‘మా షబ్బీర్ బిర్యానీ పెడతాడు తప్ప ఎవరినీ కోపగించుకోడు’ అని బదులిచ్చారు. ఆ పక్కనే ఉన్న గవర్నర్ భార్య కల్పించుకుని.. ‘ఆయన బిర్యానీ తినడు కదా’ అనడంతో మరోమారు నవ్వులే నవ్వులు.  

More Telugu News