Virat Kohli: కోహ్లీకి గాయం... తొలి టెస్టులో ఆడడంపై అనిశ్చితి!

  • విండీస్ తో మూడో వన్డే సందర్భంగా కోహ్లీ చేతి వేలికి తగిలిన బంతి
  • గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లీ
  • గాయం తీవ్రమైంది కాదని వెల్లడి
  • తొలి టెస్టులో ఆడతానని స్పష్టీకరణ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో మూడో వన్డే సందర్భంగా కోహ్లీ చేతి వేలికి దెబ్బ తగిలింది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా విండీస్ ఫాస్ట్ బౌలర్ కీమార్ రోచ్ వేసిన బంతి కోహ్లీ చేతికి బలంగా తాకింది. దాంతో టీమ్ ఫిజియో ఆ గాయానికి ప్రథమచికిత్స చేయాల్సి వచ్చింది. కోహ్లీకి గాయం నేపథ్యంలో తొలి టెస్టుకు అందుబాటులో ఉండే విషయంపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎక్స్ రే కూడా నిర్వహించినట్టు తెలిసింది.

దీనిపై కోహ్లీ మాట్లాడుతూ, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేదని తేలిందని, వేలి ఎముక విరగలేదని పరీక్షలో వెల్లడైందని తెలిపాడు. ఎముక విరిగివుంటే బ్యాటింగ్ కొనసాగించేవాడ్ని కాదని స్పష్టం చేశాడు. ఇది తేలికపాటి గాయమేనని, విండీస్ తో తొలి టెస్టులో తప్పకుండా ఆడతానని కోహ్లీ వివరించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సూపర్ సెంచరీ సాయంతో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News