Andhra Pradesh: చీరాలలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. కరణం బలరాంను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు!

  • చీరాల ఎమ్మార్వో ఆఫీసులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • హాజరైన ఎమ్మెల్యే కరణం బలరాం
  • బలరాంను ఆఫీసు ముందే అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
  • వెనక్కు వెళ్లిపోవాలని నినాదాలు.. పోటీగా టీడీపీ శ్రేణుల నినాదాలు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని చీరాల ఎమ్మార్వో కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నేత, ఎమ్మెల్యే కరణం బలరాంను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆయన స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వీల్లేదని స్పష్టం చేశాయి. కరణం వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతలోనే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సాములు భారీగా అనుచరులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించి టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించివేశారు. కరణం బలరాం మాత్రం ఎమ్మార్వో ఆఫీసులోనే ఉండిపోయారు.

More Telugu News