India: నా దేశం మారుతోంది... ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తా: మోదీ ప్రతిన

  • భారతావని మారుతోంది
  • ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళల సాధికారత
  • ఆర్టికల్ 370 రద్దుతో అభివృద్ధిలో కశ్మీర్ భాగస్వామ్యం
  • ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన నరేంద్ర మోదీ

దేశ ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఈ ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతావని మారుతోందని, ప్రతి భారత పౌరుడూ దేశాభివృద్ధి నిమిత్తం తనవంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు.

2019 ఎన్నికల తరువాత ఎర్రకోటపై నుంచి ఇది తన తొలి ప్రసంగమని గుర్తు చేసిన మోదీ, ఇచ్చిన మాటకు తాను కట్టుబడివుంటానని అన్నారు. ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి దేశంలోని ముస్లిం మహిళలందరికీ అండగా నిలిచామని, వారిలో సాధికారతను పెంచామని చెప్పారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు మెరుగైన చట్టాలను తెచ్చామని గుర్తు చేశారు.

ఎన్డీయే-2 సర్కారు వచ్చిన 10 వారాల్లోనే దేశ ప్రగతికి, సార్వభౌమత్వానికి ప్రతీకలుగా నిలిచే కీలక నిర్ణయాలను ఎన్నో తీసుకున్నామని, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు అందులో భాగమేనని మోదీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆకాంక్షను నెరవేర్చామని చెప్పారు. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం లభించిందని, వారిక భారత అభివృద్ధిలో ఓ భాగమని వ్యాఖ్యానించారు.

ఇండియాలోని రైతులందరికీ పింఛన్ ఇస్తున్నామని, వారు తమ పంటల పెట్టుబడి కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా సాయం చేయాలని నిర్ణయించామని నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశాభివృద్ధి, రక్షణ నిమిత్తం శ్రమిస్తున్న వారందరికీ ప్రణామాలు చేస్తున్నానని, వారి కారణంగానే జాతి పురోగమిస్తుందని అన్నారు.

More Telugu News