Team India: టీం ఇండియా మేనేజర్‌ దురుసు ప్రవర్తన.. బీసీసీఐ సీరియస్!

  • వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యం
  • టీమిండియాతో ఓ వీడియో షూట్ చేయాలనుకున్న భారత హైకమీషన్
  • అనుమతి కోరిన అధికారులతో సునీల్ దురుసు ప్రవర్తన

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యం దురుసు ప్రవర్తనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఇండియాకు బయలుదేరి రావాలని ఆదేశించింది. నీటి సంరక్షణపై అవగాహన కల్పించే ఓ వీడియో షూట్ ను రూపొందించాలని వెస్టిండీస్ లోని భారత హై కమీషన్ భావించింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెస్టిండీస్ లో ఉన్న టీమిండియా క్రికెటర్లతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని అనుకుంది. ఈ క్రమంలో టీం ఇండియా మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యంను అనుమతి కోరింది. అయితే, భారత హైకమీషన్ అధికారులతో ఆయన దురుసుగా ప్రవర్తించడంతో సదరు అధికారులు బీసీసీఐకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారాన్ని కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ తీవ్రంగా పరిగణించడంతో సునీల్ ని తక్షణం భారత్ కు తిరిగి రావాలని ఆదేశించినట్టు సమాచారం. సుబ్రహ్మణ్యం దురుసు ప్రవర్తనకు గాను టీమిండియా మేనేజర్ పదవి నుంచి ఆయనను తొలగించినట్టు సమాచారం.

More Telugu News