Hair: జుట్టు పెరగడానికి మందులు వాడి... ఇంటర్ విద్యార్థిని మృతి!

  • ఎమ్మిగనూరులో ఘటన
  • మందులు వాడితే, శరీరమంతా బొబ్బలు
  • పరిస్థితి విషమించి మృతి

రాలిపోతున్న జుట్టును ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో చికిత్సకు వెళ్లిన ఓ యువతి, వైద్యం వికటించి మరణించిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. మృతురాలి బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణంలో నివసించే కదిరికోట నరసన్న, రామేశ్వరమ్మ కూతురు మౌనిక (19), ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.

ఇటీవలి కాలంలో ఆమె తల వెంట్రుకలు అధికంగా రాలిపోతూ ఉండటంతో, పట్టణానికి వచ్చి వెళుతుండే కర్నూలు డాక్టర్ శరత్ చంద్ర వద్ద 2 నెలల క్రితం చూపించుకుని, శివ సర్కిల్‌ లోని పల్లవి పాలీ క్లినిక్‌ మెడికల్‌ షాప్‌ లో మందులు కొని వాడింది. ఆ మందులు వాడగా తొలుత శరీరంపై బొబ్బలు వచ్చాయి.

ఈ విషయాన్ని డాక్టర్ కు చెప్పాలని ఆమె వేడుకున్నా, క్లినిక్ యాజమాన్యం పట్టించుకోలేదు. బొబ్బలు తగ్గుతాయని, వేచి చూడాలని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. మూడు రోజుల తరువాత ఆమె ఆరోగ్యం మరింతగా విషమించి, ఆమె కన్నుమూసింది. దీంతో ఆగ్రహించిన మౌనిక బంధుమిత్రులు, క్లినిక్ ముందు ఆందోళనకు దిగారు. మెడికల్ షాపుపైనా, డాక్టర్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News