Jagan: ఒకరు జైలుకు వెళ్లిన నేత, మరొకరు జైలుకు వెళ్లబోయే నేత: కన్నా లక్ష్మీనారాయణ సెటైర్

  • ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ విఫలమవుతున్నారు
  • ఆదాయాన్ని ఇచ్చే ఇసుక పాలసీని పక్కన పెట్టేశారు
  • ఖజానాకు గుదిబండలాంటి వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు అవసరమా?

ముఖ్యమంత్రి జగన్ పాలన సరైన రీతిలో లేదని, ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడంలో ఆయన విఫలమవుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ఇసుక పాలసీని పక్కన పెట్టేశారని అన్నారు. రాష్ట్ర ఖజానాకు గుదిబండలాంటి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 5న ఇసుక పాలసీని ప్రకటిస్తానని జగన్ చెప్పారని... అప్పటి వరకు నిర్మాణరంగ కార్మికులు పస్తులు ఉండాలా? అని అడిగారు. మూడు నెలలు కూడా కాకముందే పరిపాలనలో వైసీపీ విఫలమైందని ఎద్దేవా చేశారు.

2019 ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలలోని నేతలు బీజేపీవైపు చూస్తున్నారని... 2024 నాటికి ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని కన్నా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో ప్రధాని మోదీ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందని అన్నారు. ఏపీలో ఒక నేత జైలుకు వెళ్లి వచ్చారని, మరో నేత జైలుకు వెళ్లబోతున్నారని... అందుకే, ఆ రెండు పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు చూస్తున్నారని చెప్పారు.

More Telugu News