India: చర్యకు ప్రతిచర్య!... ఈరోజు నుండి పాకిస్ధాన్ కు బస్ సేవలను రద్దు చేయనున్న భారత్

  • ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న పాకిస్థాన్
  • భారత్ తో అనేక బంధాలను తెంచుకుంటున్న దాయాది
  • ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీసు నిలిపివేత
  • తాము కూడా ఆగస్టు 12 నుంచి బస్సు సర్వీసు నడపబోమని ఢిల్లీ రవాణా సంస్థ ప్రకటన

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. భారత్ తో అన్ని సంబంధాలు తెంచుకుంటూ తన ఉక్రోషాన్ని వెలిబుచ్చుతోంది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, దౌత్య సిబ్బంది తగ్గింపు వంటి చర్యలే కాకుండా, సంఝౌతా ఎక్స్ ప్రెస్ నిలిపివేత, బాలీవుడ్ సినిమాలపై నిషేధం వంటి చర్యలతో తన ఉడుకుమోత్తనాన్ని చాటుకుంటోంది. తాజాగా లాహోర్ నుంచి ఢిల్లీకి బస్సు సర్వీసు కూడా నిలిపివేసింది. దాంతో ఢిల్లీ రవాణా సంస్థ కూడా వెంటనే ప్రతిచర్యకు దిగింది. తాము కూడా పాకిస్థాన్ కు బస్సు సర్వీసు నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ప్రకటించింది. ఆగస్టు 12 నుంచి డీటీసీ పాకిస్థాన్ కు బస్సు సర్వీసు నడపడం లేదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

More Telugu News