Andhra Pradesh: 40 ఏళ్ల అనుభవం తెలుగురాష్ట్రాల మధ్య విద్వేష గోడల్ని నిర్మిస్తే.. జగన్ దాన్ని ధ్వంసం చేశారు!: విజయసాయిరెడ్డి

  • పదేళ్ల తర్వాత డ్యాములన్నీ నిండాయి
  • కోడెలను కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషపు గోడలు నిర్మించారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రాగానే ఆ విద్వేషపు గోడలను ధ్వంసం చేసి స్నేహ వారధులు తెరిచారని వ్యాఖ్యానించారు. దాదాపు పదేళ్ల తర్వాత కృష్ణా నదిపై నిర్మించిన డ్యాములు అన్నీ నిండాయని గుర్తుచేశారు. రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ మంత్రులు పాల్గొనడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కోడెల కుటుంబం సాగించిన అక్రమాలు నివ్వెరగొలిపేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కోడెల ఫ్యామిలీ బైకులు విక్రయించి వాటికి సంబంధించిన జీవితకాల పన్నును ఆర్టీఏకు చెల్లించలేదని ఆరోపించారు. అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి కోడెలను ఇంకా టీడీపీ నుంచి బహిష్కరించకుండా కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.  

More Telugu News