Andhra Pradesh: మా ఎమ్మెల్యేలను గెలిపించని ప్రాంతాలకు రూపాయి కూడా ఇవ్వమన్న సిగ్గులేని చరిత్ర చంద్రబాబుది!: విజయసాయిరెడ్డి

  • ఇలాంటి చౌకబారు విమర్శలు బాబుకే సాధ్యం
  • జగన్ హుందాతనం ఆయనకు ఎన్నటికీ రాదు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

నెల్లూరు జిల్లాలో టీడీపీ మద్దతుదారుల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు ఆరోపణలను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు. ‘మా ఎమ్మెల్యేలను గెలిపించని ప్రాంతాలకు రూపాయి కూడా ఇవ్వబోం’ అని సిగ్గులేకుండా చెప్పిన చరిత్ర చంద్రబాబుదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలకు అతీతంగా అందరినీ ఒకేలా చూస్తామన్న సీఎం జగన్ హుందాతనం చంద్రబాబుకు ఎన్నటికీ రాదని స్పష్టం చేశారు.

మరోవైపు వైసీపీ నేతలకు సిమెంట్ బస్తాకు రూ.5 చొప్పున కంపెనీల నుంచి  డిమాండ్ చేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ చెప్పడంపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ‘ఎంత దిగజారావు ఉమా? ఊహాకల్పనలకు కూడా ఒక హద్దుండాలి. సిమెంటు కంపెనీలు బస్తాకు రూ.5 ఇవ్వనందుకే ఇసుక సరఫరాను ఆపేశామా? నీతో సహా ఇసుక బకాసురులు పదివేల మంది ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా దోచుకున్నారు. అలాగే వదిలేయక కొత్త పాలసీ ఎందుకు తెస్తున్నారు అనే కదా నీ బాధ?’ అని చురకలు అంటించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News