Dia Kumari: రాముడి కుమారుడు కుశుడి వారసత్వమే మా కుటుంబం: బీజేపీ ఎంపీ దియా కుమారి

  • రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  • తమ కుటుంబానిది కుశుడి వారసత్వమని తెలిపిన దియా కుమారి
  • తమ వద్ద చారిత్రక ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్య

హిందువులు ఎంతో భక్తితో కొలిచే శ్రీరాముడి కుమారుడు కుశుడి వారసత్వం తమ కుటుంబమని బీజేపీ ఎంపీ, జైపూర్ రాచకుటుంబ సభ్యురాలు దియా కుమారి తెలిపారు. అయోధ్య-బాబ్రీ మసీదు కేసు విచారణ సందర్భంగా... రాముడి రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇప్పటికీ అయోధ్యలో ఉన్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా తమ కుటుంబం కుశుడి వారసత్వమేనని దియా కుమారి వ్యాఖ్యానించారు. రాముడి వారసులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని ఆమె తెలిపారు. అయోధ్య వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కోరారు.

'రాముడి వారసులు ఉన్నారా? అని సుప్రీంకోర్టు అడిగింది. రాముడి వారసులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కుశుడి వంశక్రమమే మా కుటుంబం. మా సంస్థానంలో ఉన్న చారిత్రక తారప్రతుల ఆధారాలతో నేను ఈ విషయాన్ని చెబుతున్నా' అని దియా కుమారి తెలిపారు. సుప్రీంకోర్టు కోరితే తమ వద్ద ఉన్న ఆధారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, కేసు విషయంలో తాము కలగజేసుకోబోమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ రాముడిపై ఎంతో విశ్వాసం ఉందని... అయోధ్య కేసులో వీలైనంత త్వరగా తీర్పును వెలువరించాలని విన్నవించారు.

More Telugu News