Karnataka: నది వద్ద యువకుడి సెల్ఫీ... ఓ ప్రాణం కాపాడిన వైనం!

  • కర్ణాటకలోని తుంగభద్ర వంతెనపై ఘటన
  • సెల్ఫీలో కనిపించిన వృద్ధుడు
  • ప్రాణాలు కాపాడిన స్థానికులు

సెల్ఫీల మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారన్న వార్తలు అందరూ విన్నవే. కానీ ఇది అందుకు భిన్నం. ఓ యువకుడు సరదాగా తీసుకున్న సెల్ఫీ, ఓ ప్రాణాన్ని కాపాడింది. ఈ ఘటన కర్ణాటక, దావణగేరె జిల్లా హరిహర తాలుకా పరిధిలోని తుంగభద్ర నది వంతెన వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే, సదరు యువకుడు వంతెనపై నుంచి వెళుతుండగా, సెల్ఫీ తీసుకోవాలని అనిపించింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం, దాన్ని అడ్డుకుంటున్న ఆనకట్టలను చూసిన అతను సెల్ఫీలు క్లిక్ చేయడం ప్రారంభించాడు.

ఇదే సమయంలో సెల్ఫీలో రోడ్డుకు అవతలివైపున ఓ వృద్ధుడు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతూ గట్టు ఎక్కి కనిపించాడు. వెంటనే వెనక్కి తిరిగి చూసిన యువకుడు, అతను ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టు అర్థమైంది. ఆ వెంటనే గట్టిగా కేకలు వేశాడు. ఇంతలో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు పరుగులు పెడుతూ వచ్చారు. అతన్ని కాపాడారు. ఇప్పుడా చిత్రం తెగ వైరల్ అవుతోంది.

More Telugu News