India: బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ పై నిప్పులు చెరిగిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

  • ఆరెస్సెస్ నాజీ సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందింది
  • కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోంది
  • రేపు పాకిస్థాన్ ను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ లపై విరుచుకుపడ్డారు. జర్మనీలో నాజీ సిద్ధాంతాలు, భావజాలంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) స్ఫూర్తి పొందిందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. కశ్మీర్ లో కర్ఫ్యూ, అణచివేతతో పాటు సామూహిక హత్యలకు ఆ సంస్థ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జాతి హననం ద్వారా కశ్మీర్  భౌగోళిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నాజీ జాతీయవాదం తరహాలో ఆరెస్సెస్ హిందూ జాతీయవాదం కేవలం కశ్మీర్ వరకే ఆగిపోదు. భారత్ లోని ముస్లింలందరినీ వీళ్లు అణచివేస్తారు. చివరికి పాకిస్థాన్ ను లక్ష్యంగా చేసుకుంటారు. వీళ్లంతా హిట్లర్ జాతీయవాదానికి హిందూ వెర్షన్ లాంటివాళ్లు. గతంలో తమ జాతే గొప్పదన్న హిట్లర్ ను సహించినట్లు ప్రపంచదేశాలు దీన్నీ చూసిచూడనట్టు ఊరుకుంటాయా?’ అని ఇమ్రాన్ ప్రశ్నించారు.

More Telugu News