Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ ప్రశాంతం... ఒక్క తుపాకి కూడా పేలలేదంటున్న అధికారులు!

  • ఆర్టికల్ 370 రద్దు తరువాత పరిస్థితి ప్రశాంతం
  • ఒకటి రెండు ప్రాంతాల్లో రాళ్లు రువ్విన ఘటనలు
  • జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత, ఆ రాష్ట్రంలో ఇంతవరకూ ఒక్క తుపాకి కూడా పేలలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితి ఎంతో ప్రశాంతంగా ఉందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదని, పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను సడలించామని వెల్లడించారు. ఒకటి రెండు ప్రాంతాల్లో రాళ్లు రువ్విన ఘటనలు నమోదయ్యాయని, సైనికులు, పోలీసులు వెంటనే స్పందించి ఆందోళకారులను చెదరగొట్టారని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు.

జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని, ఆ వార్తలను మీడియా ప్రసారం చేయాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో దిల్ బాగ్ సింగ్ స్పందించారు. రాహుల్ వ్యాఖ్యల తరువాత నిమిషాల్లోనే జమ్మూకశ్మీర్ పోలీసు విభాగం అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ లో దిల్ బాగ్ స్టేట్ మెంట్ ను ఉంచింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ విధ్వంస ఘటనలు నమోదు కాలేదని ఆయన అన్నారు. ప్రజలు ఎవరూ ఊహాజనిత వార్తలను, వైరల్ అయ్యే వార్తలను నమ్మవద్దని ఆయన అన్నారు. 

More Telugu News