Jana sena: నాపై వస్తున్న వదంతులు చూసి ఆశ్చర్యపోయా: ‘జనసేన’ నేత వీవీ లక్ష్మీనారాయణ

  • ఓ నానుడిని ప్రస్తావించిన లక్ష్మీనారాయణ
  • గిట్టని వాళ్లు వదంతులు సృష్టిస్తారు
  • మూర్ఖులు వాటిని వ్యాపింపజేస్తారు
  • తెలివి తక్కువ వ్యక్తులు వాటిని ఆమోదిస్తారు

జనసేన పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ ఆ పార్టీని వీడుతున్నారన్న వదంతులు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈరోజు ఉదయం నుంచి తనపై వస్తున్న ఈ వదంతుల గురించి తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. ‘గిట్టని వాళ్లు వదంతులు సృష్టిస్తారు. మూర్ఖులు వాటిని వ్యాపింపజేస్తారు. తెలివి తక్కువ వ్యక్తులు వాటిని ఆమోదిస్తారు’ అని చెప్పే ఓ నానుడిని ఆయన ప్రస్తావించారు. ఏ కేటగిరీకి చెందుతారో వాళ్లే నిర్ణయించుకోవాలని సూచించారు. పార్టీకి ఎంత వరకూ తాను ఉపయోగపడతానని ‘జనసేన’ అధ్యక్షుడు భావిస్తారో, అంత వరకూ ఆ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. దయచేసి, ఇలాంటి వదంతులను సృష్టించేందుకు కాకుండా, వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించేందుకో, మొక్కలు నాటేందుకో.. మరిన్ని మంచి పనులు చేసేందుకో సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

More Telugu News