Visakhapatnam District: సింహాచలం దేవస్థానంకు నూతన ఈవో నియామకం

  • ఆయన స్థానంలో విశాఖ జేసీ-2 వెంకటేశ్వరరావు నియామకం
  • గతంలో దేవస్థానం భూ పరిరక్షణ విభాగంలో పనిచేసిన జేసీ
  • ఆరేళ్లకు పైగా సేవలందించిన కోడూరి

మూడు నెలల క్రితం రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ హోదా నుంచి అదనపు కమిషనర్‌గా పదోన్నతి పొంది, చారిత్రక పుణ్యక్షేత్రం సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం కార్యనిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కోడూరి రామచంద్రమోహన్‌ను  ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌-2గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వెంకటేశ్వరరావును నియమించింది. ఆరేళ్లకు పైగా సుదీర్ఘకాలం సేవలందించిన రామచంద్రమోహన్‌కు మూడు నెలల క్రితం పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. అయితే స్వామివారి వార్షిక ఉత్సవాలైన చందనోత్సవం, గిరి ప్రదక్షిణ ఉండడంతో ఈఓగా అదనపు బాధ్యతల్లో కొనసాగించింది.

తాజాగా ఈవోను బదిలీ చేస్తూ 1823 నంబరు జీఓను రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా జారీ చేశారు. కొత్త ఈవోగా నియమితులైన వెంకటేశ్వరరావుకు గతంలో దేవస్థానం భూ పరిరక్షణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్డీఓగా పనిచేసిన వెంకటేశ్వరరావు ఎన్నికల ముందే విశాఖ జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు.

More Telugu News