Kerala: కేరళలో దారుణ పరిస్థితులు.. 14 మంది మృతి

  • వరదలతో చిగురుటాకులా వణుకుతున్న కేరళ
  • ఆర్మీ సాయం కోరిన ముఖ్యమంత్రి పినరయి విజయన్
  • వయనాడ్‌ను ఆదుకోవాలంటూ ప్రధానికి రాహుల్ మొర

వరదలతో కేరళ చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాల కారణంగా గురువారం ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు మొత్తం 14 మంది మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురున్నారు. 22 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 315 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం అదనంగా మరో 13 యూనిట్ల ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆర్మీని కోరారు. వరద బీభత్సంతో వణికిపోతున్న వయనాడ్‌ను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. కాగా, వయనాడ్‌లో గురువారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో 40 మంది చిక్కుకుపోయారు.

మరోవైపు, ఈ నెల 14 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇడుక్కి, మలప్పురం, వయనాడ్, కోజికోడ్ జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం సహా 12 జిల్లాలు ఇప్పటికే వరద తాకిడికి గురయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News