Hindupuram: హిందూపురం స్టీల్ ఫ్యాక్టరీలో బెంగళూరు ఐటీ అధికారుల సోదాలు!

  • ఏ-1 స్టీల్ పరిశ్రమలో సోదాలు
  • పలు కీలక పత్రాలు స్వాధీనం
  • మీడియాకు అనుమతి నిరాకరణ

అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోకి బెంగళూరు నుంచి ఐటీ అధికారులు వచ్చి మెరుపు దాడులు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. ఇక్కడి ఏ-1 స్టీల్‌ ఫ్యాక్టరీలో దాడులు జరుగగా, అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కర్ణాటక పరిధిలోని గౌరీబిదనూరు సరిహద్దులోను, ఏపీ పరిధిలో మణేసముద్రం వద్ద ఉన్న ఉక్కు కర్మాగారంలో నిన్న ఉదయం నుంచి సోదాలు జరిగాయి.

బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు, ఏ-1 స్టీల్‌ కు సంబంధించిన అన్ని పరిశ్రమల్లోనూ దాడులు జరిపారు. ఇందులో భాగంగానే హిందూపురం వద్ద ఉన్న స్టీల్‌ పరిశ్రమలో కూడా సోదాలు చేసినట్టు తెలిసింది. ఐటీ అధికారులకు స్థానిక పోలీసులు సహకరించారు. కాగా, విషయం తెలుసుకున్న మీడియా పరిశ్రమలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అధికారులు అనుమతించక పోవడం గమనార్హం.

More Telugu News