Srinivas Goud: ఆటోలో 18 మంది... స్వయంగా ఆపి సీజ్ చేయించిన తెలంగాణ మంత్రి!

  • మహబూబ్ నగర్ లో ఘటన
  • ఓవర్ లోడ్ ఆటోపై శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
  • పరిమితికి మించి ఎక్కిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక

ఓవర్ లోడ్ తో వెళుతున్న ఆటోను గమనించిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తీవ్ర ఆగ్రహంతో దాన్ని ఆపించి, సీజ్ చేయించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, స్థానిక సుభాష్ చౌరస్తాలో శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఇతర ఉన్నతాధికారులు కూడలి విస్తరణ పనులను ఎలా చేపట్టాలన్న విషయమై చర్చిస్తున్న వేళ, అదే సమయంలో పాఠశాలకు వెళుతున్న ఓ ఆటో కనిపించింది. ఆటో కిక్కిరిసి ఉండటం, పిల్లలు ప్రమాదకరంగా ప్రయాణిస్తుండటాన్ని గమనించిన శ్రీనివాస్ గౌడ్, వెంటనే దాన్ని ఆపించారు. ఆటో నుంచి పిల్లలను కిందకు దింపగా, మొత్తం 18 మంది పిల్లలు, వారి పుస్తకాల బ్యాగ్ లు, లంచ్ బాక్స్ లూ ఉండటం చూసి, డ్రైవర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఆటోను సీజ్ చేయాలని, పరిమితికి మించి పిల్లలను ఎక్కించే ఆటోలను ఉపేక్షించరాదని అధికారులను ఆదేశించారు.

More Telugu News