Hyderabad: పోలీస్ కమిషనర్ ఇంటి సమీపంలో.. కానిస్టేబుల్ భార్య మెడలోని పుస్తెల తాడును తెంపుకెళ్లిన దొంగ!

  • హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఘటన
  • పోలీస్ లైన్స్‌లో కమిషనర్ ఇంటి సమీపంలో చైన్ స్నాచింగ్
  • వారం రోజుల్లో రెండో ఘటన

పట్టపగలు పోలీస్ కమిషనర్ ఇంటి సమీపంలో కానిస్టేబుల్ భార్య మెడలోని పుస్తెల తాడును దొంగలు తెంపుకెళ్లారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన మోహన్ హైదరాబాద్‌లోని సీపీఎల్ అంబర్‌పేటలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ భార్య అరుణ, పిల్లలతో కలిసి అక్కడే పోలీస్ లైన్స్‌లో నివసిస్తున్నాడు.

సమీపంలోని స్కూల్లోనే పిల్లలు చదువుతుండడంతో అరుణ రోజూ స్కూలుకు వెళ్లి పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి వస్తుండేది. గురువారం కూడా ఇలానే బాక్స్ ఇచ్చి వస్తుండగా కమిషనర్ ఇంటి సమీపంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుని పరారయ్యారు. గొలుసును లాక్కుకునే ప్రయత్నంలో అరుణను బలంగా నెట్టివేయడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం ఐదు బృందాలతో గాలిస్తున్నారు. కాగా, వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో చైన్ స్నాచింగ్ జరిగింది. అయితే, కొన్ని గంటల్లోనే దొంగలు పట్టుబడ్డారు.  

More Telugu News