Telangana: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ తో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ భేటీ!

  • రాష్ట్రంలో వైద్య సదుపాయాల కోసం విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
  • ఎన్ఎంసీ బిల్లుతో రాష్ట్రాలకు లాభమేనన్న హర్షవర్థన్

హైదరాబాద్‌లో గాంధీ ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రిలో ‌సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో అదనపు డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, జాతీయ రహదారుల పక్కన ట్రామా సెంటర్ల ఏర్పాటు, ఆరోగ్య శ్రీ, కేసీఆర్ కిట్ పథకాలకు సహకారం అందించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తో సమావేశమైన ఈటల ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఆస్పత్రులను అప్ గ్రేడ్ చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశాం.  హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు ప్రారంభించామని, గ్రామాల్లో ఉన్న వైద్య శిబిరాలను వెల్ నెస్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, ఎయిమ్స్ నిర్మాణం, సైన్స్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం’ అని ఈటల చెప్పారు. ఎంఎన్ సీ బిల్లు వల్ల రాష్ట్రాలకు మేలు జరుగుతుందనీ, పీజీ వైద్య విద్యార్థులు అర్హతపొందేవరకూ ఎన్నిసార్లయినా ఈ పరీక్షను రాయొచ్చని హర్షవర్థన్ చెప్పినట్లు ఈటల అన్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల, ఆదిలాబాద్ రిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని ఈటల వివరించారు.

More Telugu News