Andhra Pradesh: కొన్ని శనిగ్రహాలు అడ్డుపడకపోతే పోలవరం ఇప్పటికే పూర్తయిపోయేది!: బుద్ధా వెంకన్న

  • 2014 నాటికి 5 శాతం పనులు కూడా కాలేదు
  • మేం వచ్చాక ఏకంగా 70 శాతం ప్రాజెక్టు పూర్తయింది
  • మిగతా 30 శాతం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పండి
  • వైసీపీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం

2014 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు 5 శాతం కూడా పూర్తి కాలేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులను 70 శాతం పూర్తిచేసిందని వ్యాఖ్యానించారు. ఈ మధ్యలో కొన్ని శనిగ్రహాలు అడ్డుపడకపోతే ప్రాజెక్టు దాదాపు పూర్తయిపోయేదని అభిప్రాయపడ్డారు. నిజంగా వైసీపీ నేతలకు అంత పట్టుదల ఉంటే చంద్రబాబుపై ఏడవడం ఆపేసి పోలవరాన్ని ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘వెనకటికి ఒకడు.. 'నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నాడంట' సాయిరెడ్డి గారూ ! మంగళవారం చెప్పిన మాటలు వింటుంటే అలాగే అనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు జోలికి పోకుండా ఉత్త కాలువల్లో మట్టితీసి కోట్ల ధనయజ్ఞం చేసినవారి సంగతి అందరికీ తెలిసిందే. మీ బడాయి మాటలు ఎవరూ నమ్మరు’’ అని విమర్శించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News