Andhra Pradesh: జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయ్!: మంత్రి కొడాలి నాని

  • జగన్ సీఎం కావాలని మొక్కుకున్నా
  • ఇప్పుడు మొక్కు చెల్లించుకునేందుకు వచ్చా
  • తిరుమలలో మీడియాతో ఏపీ మంత్రి

వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కావాలనీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావాలని తాను ఏడుకొండల స్వామికి మొక్కుకున్నానని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఇప్పుడు మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. జగన్ కు, ఏపీ ప్రజలకు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అన్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణ, గోదావరితో పాటు ఇతర నదులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకుంటున్నాయని మంత్రి తెలిపారు. జగన్ ను ఇబ్బంది పెట్టడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామని పునరుద్ఘాటించారు.

ఈ ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తామనీ, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు, స్వయం ప్రకటిత మేధావులు, ఇతర ముసుగుల్లో కొందరు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

More Telugu News