Andhra Pradesh: ఆ మాట అనడానికి సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి

  • పాడిఆవులాంటి ఖజానాను దోచుకున్నారు
  • ప్రజల నోటికాడ ముద్దను లాక్కున్నారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో ఇంతవరకూ అంతుపట్టడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనడానికి చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. పాడిఆవు లాంటి ప్రభుత్వ ఖజానాను చంద్రబాబు పిండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాకుండా తనను తాను చంద్రబాబు గోమాతగా అభివర్ణించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకంటే పెద్ద జోక్ ఇంకొకటి ఉండదని వ్యాఖ్యానించారు.

‘అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా?’ అని ప్రశ్నించారు.

‘వైఎస్సార్‌ పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారు. పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్‌ మూడేళ్లలో పూర్తయ్యేది.7 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేది. ప్రధాని అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదు’ అని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News